మాస్ మహారాజ రవితేజ ‘బెంగాల్ టైగర్’ చిత్రం విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. కొన్ని కారణాల వల్ల దాదాపు సంవత్సరం పాటు రవితేజ గ్యాప్ తీసుకున్నాడు. వరుసగా రెండు చిత్రాలను రవితేజ ప్రారంభించాడు. అందులో ఒకటి ‘రాజా ది గ్రేట్’ రెండవది ‘టచ్ చేసి చూడు’. ఈ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదల చేస్తానంటూ రవితేజ గతంలోనే ప్రకటించాడు. తాజాగా ‘టచ్ చేసి చూడు’ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.
విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టచ్ చేసి చూడు’ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ మొదటి వారంలో తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నెలతో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి వెంటనే సెప్టెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సెప్టెంబర్లో ఇప్పటికే బాలయ్య 101వ చిత్రం, మహేష్బాబు ‘స్పైడర్’, రామ్ చరణ్ కొత్త చిత్రంతో పాటు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రం కూడా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఇన్ని పెద్ద సినిమాలు విడుదల అవ్వబోతున్నా కూడా రవితేజ వెనక్కు తగ్గేది లేదని సెప్టెంబర్లోనే ఆ సినిమాలకు పోటీగా వస్తానంటూ తన బలుపును నిరూపించుకుంటున్నాడు. మరి రవితేజ చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను దక్కించుకుని ఆ చిత్రాలకు గట్టి పోటీని ఇస్తుందా అనేది చూడాలి.
