కమెడియన్ పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. పృథ్వీ రాజ్ తనను ఇంటి నుండి వెళ్లగొట్టాడని, తనకు నెలకు 10 లక్షల భరణం ఇప్పించాల్సిందిగా ఆమె కోర్టును కోరడం జరిగింది. కోర్టు విచారణ జరిపి పృథ్వీ రాజ్ నెలకు 8 లక్షలు శ్రీలక్ష్మికి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో పృథ్వీ రాజ్ కొడుకు మొదటి సారి మీడియా ముందుకు వచ్చాడు. పృథ్వీరాజ్ తనయుడు అయిన సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తండ్రికి సపోర్ట్ చేశాడు. తన తండ్రి ఎప్పుడు కూడా తమను పక్కన పెట్టలేదని, ఇటీవలే నా సోదరి వివాహంను తండ్రి వైభవంగా నిర్వహించారని, తన తల్లిని కూడా ఆయన బాగానే చూసుకున్నారు.
ఆమె ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదని, అమ్మ వెనుక ఎవరో ఉండి ఇలా చేయిస్తున్నారనిపిస్తుందని పృథ్వీరాజ్ తనయుడు శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. శ్రీనివాస్ హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడట. తన తండ్రిని మానసికంగా హింసించేందుకు కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశాడు.
