హీరోగా పరిచయం అయ్యి, సక్సెస్ దక్కక పోవడంతో విలన్ వేశాలు వేసి మళ్లీ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. హీరోగా సక్సెస్లు లేక పోవడంతో మళ్లీ ఈయన విలన్ వేశాలు వేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గోపీచంద్ మూడు సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా రెండు నెలల వ్యవదిలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్ని సవ్యంగా జరిగితే ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం గత నెలలో విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా వేశారు. ఈనెల 28న ‘గౌతమ్ నంద’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించి భారీ అంచనాలున్నాయి. సంపత్ నంది భారీ స్టైలిష్ యాక్షన్ చిత్రంగా ఆ సినిమాను తెరకెక్కించినట్లుగా టీజర్, ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. గోపీచంద్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా కూడా అది పేరు తెచ్చుకుంది.
‘గౌతమ్ నంద’ చిత్రం విడుదలైన నెలలోపులోనే ‘ఆక్సీజన్’ చిత్రం రాబోతుంది. ఆగస్టు 18న ఆ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే విడుదల ఆగిపోయిన బుల్లెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మూడు సినిమాలు గోపీచంద్ భవిష్యత్తును నిర్ణయిస్తాని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఫలితం తారు మారు అయితే గోపీచంద్ విలన్ వేశాలు అయినా వేసుకోవాలి లేదంటే సినిమాలకు గుడ్బై అయినా చెప్పాలంటూ విశ్లేషకులు జోష్యం చెబుతున్నారు.
