టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కొన్ని సార్లు అతి చేస్తారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరో కోసం ఇతర హీరోల అభిమానులతో గొడవలు పడటం, కొన్ని సార్లు హత్యలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ అభిమాని తన అభిమాన నటుడి సినిమాపై వస్తున్న వివాదాలు తట్టుకోలేక మనస్థాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగినట్లుగా సమాచారం అందుతుంది.
నిన్న అల్లు అర్జున్ నటించిన ‘డీజే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘డీజే’ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. భారీ విజయాన్ని సాధిస్తుందని ఆశించిన ఫ్యాన్స్ వస్తున్న టాక్తో కాస్త అసహనంగా ఉన్నారు. అదే సమయంలో ఈ చిత్రంలో అల్లు అర్జున్ చెప్పు వేసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పాడంటూ బ్రహ్మణులు ఆగ్రహంగా ఉన్నారు.
సినిమాను బ్యాన్ చేయాలి అంటూ కొందరు బ్రహ్మణులు ఆందోళనలు చేస్తున్నారు. వీటన్నింటికి మనస్థాపంకు గురైన అభిమాని సంధ్య థియేటర్ ముందు అభిమానులు ఉన్న సమయంలో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కొందరు ఫ్యాన్స్ అతడిని ఆపి నీళ్లు పోశారు. దాంతో ప్రమాదం తప్పింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అభిమానం ఉండవచ్చు, కాని ఒక స్థాయి వరకు మాత్రమే ఉండాలని ఎక్కువ అయితే బాగోదు అంటూ పోలీసులు అతడి మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేశారు.
