యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా ఫుల్ ఫాంలో ఉన్నాడు. గత సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్’ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్లను దక్కించుకున్నాడు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుకలో ఎన్టీఆర్ సందడి కనిపించింది ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ను అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్తోనే కాకుండా అద్బుతమైన నటుడిగా నిరూపించుకున్నాడు.
2007వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమదొంగ’ చిత్రంకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. సరిగ్గా పది సంవత్సరాల తర్వాత మరో అవార్డును అందుకున్నాడు. ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ అవార్డు కోసం పది సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. యంగ్ టైగర్ గత సంవత్సరం చేసిన ‘జనతాగ్యారేజ్’ చిత్రానికి కూడా పలు అవార్డులు రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘టెంపర్’ చిత్రానికి ఎన్టీఆర్ అవార్డు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారు. కాని అప్పుడు ఎన్టీఆర్కు నిరాశే మిగిలింది. ఈ సంవత్సరం మాత్రం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంకు గాను ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ను దక్కించుకుని ఫ్యాన్స్కు సంతోషాన్ని కలిగించాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాకు కూడా ఎన్టీఆర్ అవార్డులను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న ఎన్టీఆర్కు కంగ్రాట్స్.
